Share News

PM Modi : చైనా బీఆర్‌ఐ ప్రమాదకరం

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:11 AM

ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

PM Modi : చైనా బీఆర్‌ఐ ప్రమాదకరం

  • ఆసియా దేశాలను అప్పుల్లో ముంచేస్తోంది.. గ్లోబల్‌ సౌత్‌ సదస్సులో మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. శనివారం జరిగిన ‘గ్లోబల్‌ సౌత్‌ దేశాల గళం’ సదస్సులో వర్చువల్‌గా ఆయన ప్రసంగించారు.

గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు పరస్పర వాణిజ్యం, సమ్మిళిత వృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్‌ సహకరిస్తుందని తెలిపారు. ఆయా దేశాలు ఐక్యంగా ఉండడం ద్వారా ఆరోగ్య, ఆహార, ఇంధన భద్రత విషయంలో తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(డీపీఐ) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సామాజిక ప్రభావ నిధికి ప్రాథమికంగా 25 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.200 కోట్లు) సహకారాన్ని ప్రకటించారు.

ఇతర దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యం పంచుకునేందుకు భారత్‌ దేశ సొంత అభివృద్ధి, అనుభవాల ఆధారంగా గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కంపాక్ట్‌(జీడీసీ)ను ప్రధాని ప్రతిపాదించారు. ఇది గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ప్రతిపాదించిన అభివృద్ధి ప్రాధాన్యాలపైనా దృష్టి పెడుతుందన్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న దేశాలకు కూడా గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కంపాక్ట్‌ ఎలాంటి భారం మోపదని తెలిపారు. భాగస్వామ్య దేశాలకు సుస్థిరాభివృద్ధిలో సహకారం అందిస్తుందన్నారు.

చైనా ప్రతిపాదిత బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ)ని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల నిలకడలేని ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందని అన్నారు.

బీఆర్‌ఐకి ప్రత్యామ్నాయంగా గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కంపాక్ట్‌ను అందిపుచ్చుకోవాలన్నారు. దీనివల్ల వాణిజ్యం వృద్ధి చెందుతుందని, సుస్థిరాభివృద్ధిలో సామర్థ నిర్మాణం పెరుగుతుందని, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవచ్చని, ప్రాజెక్టుల కోసం రాయితీ రుణాలు, గ్రాంట్లను పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు రూ.21కోట్ల (2.5 మిలియన్‌ డాలర్లు)తో ప్రత్యేక నిధి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా వాణిజ్య విధానాలపై శిక్షణకు రూ.8 కోట్ల(1 మిలియన్‌ డాలర్లు)తో మరోనిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.


గ్లోబల్‌కు జనరిక్‌ ఔషధాలు

గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు చౌక ధరలకే సమర్థవంతమైన జనరిక్‌ ఔషధాలను అందుబాటులో ఉంచుతామని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఆరోగ్య మైత్రి’ కింద ఆఫ్రికా, పసిఫిక్‌ ఐలాండ్‌ దేశాలకు డయాలిసిస్‌ మిషన్లను, ప్రాణాధారిత ఔషధాలను అందించామని, అదేవిధంగా ఆసుపత్రులు, జన్‌ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతలు, సంఘర్షణలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది చాలా తీవ్రమైన విషయం’ అని వ్యాఖ్యానించారు. సవాళ్లను అధిగమించేందుకు గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఐక్యంగా ఉండాలన్నారు.

ఎన్నో సవాళ్లు

‘‘మనం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటు వాదాలు మన సమాజాలకు తీవ్ర సవాళ్లుగా పరిణమించాయి’’ అని ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతికత కారణంగా తలెత్తుతున్న సామాజిక సవాళ్లు పుట్టుకొస్తున్నాయన్నారు. గత శాతాబ్దపు పాలన, సంస్థలు ఈ శతాబ్దపు సవాళ్లతో పారాడలేక పోతున్నాయని తెలిపారు. 2022లో జీ-20 సదస్సుకు నేతృత్వం వహించిన భారత్‌.. గ్లోబల్‌ సౌత్‌ గళాన్ని వినిపించే వేదికను సృష్టించిందన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 04:11 AM