Share News

IND vs SA: కెరీర్‌లో చివరిసారి బ్యాటింగ్ చేసిన ఎల్గర్.. టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తనపై ప్రశంసలు

ABN , Publish Date - Jan 04 , 2024 | 12:40 PM

సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డీన్ ఎల్గర్ తన కెరీర్‌లో చివరి సారి బ్యాటింగ్ చేసేశాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం వీడ్కోలు పలుకుతున్నట్టు ఎల్గర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎల్గర్ బ్యాటింగ్ ముగిసింది.

IND vs SA: కెరీర్‌లో చివరిసారి బ్యాటింగ్ చేసిన ఎల్గర్.. టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తనపై ప్రశంసలు

కేప్‌టౌన్: సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డీన్ ఎల్గర్ తన కెరీర్‌లో చివరి సారి బ్యాటింగ్ చేసేశాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం వీడ్కోలు పలుకుతున్నట్టు ఎల్గర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎల్గర్ బ్యాటింగ్ ముగిసింది. దీంతో తన కెరీర్ చివరి మ్యాచ్‌లో ఎల్గర్ బ్యాటింగ్ పూర్తైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇక ఎల్గర్ బ్యాటింగ్ కనిపించదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసిన 36 ఏళ్ల ఎల్గర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ముఖేష్ వేసిన 11వ ఓవర్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ ఔట్‌తో ఎల్గర్‌ కెరీర్ ముగియడంతో మన ఆటగాళ్లు పెదగా సంబరాలు చేసుకోలేదు. అంతేకాకుండా చివరి సారిగా పెవిలియన్‌కు వెళ్తున్న ఎల్గర్‌ను అభినందించారు. మొదట మహ్మద్ సిరాజ్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇలా భారత ఆటగాళ్లు ఎల్గర్ వద్దకు వెళ్లి అభినందించారు. మైదానంలోని భారత ఆటగాళ్లే కాకుండా డగౌట్‌లో ఉన్న టీమిండియా స్టాఫ్, సౌతాఫ్రికా ఆటగాళ్లు, మైదానంలోని ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.


ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తిపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా అంతర్జాతీయ కెరీర్‌లో 86 టెస్టు మ్యాచ్‌లాడిన ఎల్లర్ 37 సగటుతో 5,347 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 199గా ఉంది. బౌలింగ్‌లోనూ 15 వికెట్లు పడగొట్టాడు. ఇక 8 వన్డేలు ఆడి 104 పరుగులు చేశాడు. 2 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్‌‌పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి. రెండు జట్లు తమ మొదటి ఇన్నింగ్స్‌లో తొలి రోజే ఆలౌట్ అయ్యాయి. అంతేకాకుండా తొలి రోజు ఆటలోనే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య జట్టు సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ జట్టు భారత్ కన్నా ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులు మాత్రమే చేయగా.. భారత జట్టు 153 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 98 పరుగుల అధిక్యం లభించింది. తొలి రోజే సంచలనాల మీద సంచలనాలు నమోదుకావడంతో ఈ టెస్టు మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. పిచ్ రెండో రోజు కూడా ఇదే విధంగా ఉంటే టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయం.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 04 , 2024 | 12:40 PM