Share News

TG News: LRS‌పై భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:00 PM

LRS‌పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

TG News: LRS‌పై భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు
Bhatti Vikramarka

హైదరాబాద్: LRS‌పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన సంబంధిత దరఖాస్తులను పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే LRS దరఖాస్తులు పూర్తిచేయకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.


ఆదాయం పెంచే మార్గాలపై అన్వేషించాలి..

ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


బడ్జెట్ అంచనాలకు..

సమీక్షలో భాగంగా గత రెండు నెలల ఆర్థిక ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఎలాంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పటిష్ట పరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని వివరించారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం భట్టి అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు.


రుణాల వడ్డీ రేటుపై...

ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇల్లు, ఇళ్ల స్థలాలు వాటి పరిస్థితిని సమీక్షించారు.


ఆరోగ్యశ్రీ బకాయిలపై సమీక్ష

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆస్పత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించాలని, వారితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తా... వీహెచ్ షాకింగ్ కామెంట్స్

Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Pub Scam: అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 08:01 PM