Share News

Deputy CM Bhatti: 2025మార్చికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి..

ABN , Publish Date - Sep 11 , 2024 | 07:45 PM

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే కారణమని భట్టి అన్నారు.

Deputy CM Bhatti: 2025మార్చికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి..
Deputy CM Bhatti Vikramarka

నల్గొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే కారణమని భట్టి అన్నారు. నిత్యం సమీక్షలు జరపకుండా ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్లే వ్యయం మరింత పెరిగి ఆర్థిక భారం పడిందని డిప్యూటీ సీఎం చెప్పారు.


ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.." 8.2.2015న పవర్ ప్లాంట్ పనులకు పునాది పడింది. 17.10.2015న పనులు మొదలుపెట్టారు. 2020 అక్టోబర్‌ నాటికి రెండు యూనిట్లు, 2021నాటికి మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న సమయానికి అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయకపోవడానికి వారి చిత్తశుద్ధి లోపమే కారణం. నిత్యం సమీక్షలు జరపకుండా ప్రాజెక్టును పక్కకు పెట్టారు. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది.


50శాతం విదేశీ బొగ్గు మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)కి చెప్పారు. కాలక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయి. అప్పుడే ఎన్జీటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగేది కాదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్‌జీటీకి కావాల్సిన పబ్లిక్ హియరింగ్‌ను ఫిబ్రవరి 2024న చేపట్టాం. జులైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చాం. ఫలితంగా రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ పనులు పూర్తి చేశాం.


ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం క్యాలెండర్ ఖరారు చేశాం. 31 మార్చి 2025నాటికి 4,000 మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. అందుకు అనుగుణంగా టార్గెట్ పెట్టుకున్నాం. రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తి చేయాలని నిర్ణయించాం. మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400మెగావాట్లు ఉత్పత్తి ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన రెండు యూనిట్లు 2025 మార్చికి పూర్తి చేసి 4,000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుందనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది.


రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర రూ.6.35లుగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి, విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం. పవర్ ప్లాంట్ భూనిర్వాసితులు గొప్ప త్యాగధనులు. భూసేకరణ పరిహారం చెల్లించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వారి విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాం" అని చెప్పారు.

Updated Date - Sep 11 , 2024 | 07:45 PM