Share News

Pawan Kalyan: కర్ణాటకతో పవన్ చర్చలు సఫలం.. ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు

ABN , Publish Date - Aug 08 , 2024 | 09:38 PM

కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల అధికారులు, పాలకులు కూడా కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయని తెలిపారు. అటవీ శాఖపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి సమావేశంలో ఏడు ప్రత్యేకమైన అంశాలు చర్చకు వచ్చాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Pawan Kalyan: కర్ణాటకతో పవన్ చర్చలు సఫలం.. ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు

అమరావతి: కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల అధికారులు, పాలకులు కూడా కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయని తెలిపారు. అటవీ శాఖపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి సమావేశంలో ఏడు ప్రత్యేకమైన అంశాలు చర్చకు వచ్చాయన్నారు. ఈ విషయంపై రెండు ప్రభుత్వాలు, అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు. కీలకమైన అంశాలపై చర్చ జరగడంతో పాటు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల అటవీ అధికారులు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా 8 కుంకీ ఏనుగులను ఏపీకి అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


కీలక అంశాలపై ఎంఓయూలు

గురువారం(ఈరోజు) బెంగళూరు విధాన సౌధలో కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై ఎంఓయూలు కుదుర్చుకొని సంతకాలు చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్, ఈశ్వర్ ఖండ్రే సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలోనూ కొన్ని ఏనుగులు గ్రామాల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని. ప్రాణహాని కలిగిస్తున్నాయని చెప్పారు. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయని అన్నారు. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


రెండు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాలి..

"అటవీ శాఖా మంత్రిగా అధికారులతో సమీక్ష సందర్భంగా కర్ణాటక సరిహద్దును పంచుకుంటున్న చిత్తూరు జిల్లా గ్రామాలతో పాటు పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి వచ్చింది. ఇవి పంట పొలాలను నాశనం చేయడం వల్ల విపరీతమైన ఆస్తినష్టం జరగడంతో పాటు ప్రాణనష్టం కూడా జరుగుతోంది. దీనికి పరిష్కారంగా ఏనుగులను దారి మళ్లించేందుకు ఎంతగానో ఉపయోగపడే కుంకీ ఏనుగుల ప్రస్తావన వచ్చింది. కుంకీ ఏనుగులు కర్ణాటక అటవీశాఖ వద్ద ఉన్నాయని అధికారులు చెప్పగానే, కర్ణాటక పాలకులతో మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించడానికి సిద్ధమైన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇక మీదట కూడా రెండు రాష్ట్రాలు ఇదే సహకారంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


ఏడు అంశాలపై ప్రత్యేకంగా చర్చించాం

22-P.jpg

‘‘ఈ సమావేశంలో ఏడు ప్రత్యేక అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం నరికివేత మీద మాట్లాడాం. ఎంతో విలువైన ఎర్రచందనం ఇతర దేశాలకు అక్రమంగా తరలి వెళ్లడం మీద కర్ణాటక అధికారులు కూడా దృష్టి సారించాలని కోరాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా కర్ణాటక, తమిళనాడు ఇతర ప్రాంతాల మీదుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోంది. కర్ణాటక అధికారులు కూడా అక్రమంగా రవాణా అవుతున్న రూ.140 కోట్ల ఎర్రచందనాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఇది కర్ణాటక అటవీశాఖ ఆధీనంలో ఉంది. ఇంత భారీ మొత్తంలో ఎర్రచందనం పట్టుకున్న అధికారులకు అభినందనలు. దీన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లాలనే విషయంపై మరోసారి చర్చించి ముందుకు వెళ్తాం. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి కర్ణాటక అధికారులు తగిన విధంగా సహకరించాలి’’ అని పవన్ కళ్యాణ్ కోరారు.


అటవీ ఉత్పత్తులపై..

‘‘అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా సాంకేతికను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా శాటిలైట్ ఆధారిత నిఘా పెట్టి అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయించాం. టెక్నాలజీని పంచుకునే విషయంలో కూడా ఇరు రాష్ట్రాలు తగిన విధంగా సహకరించుకుంటాయి. వేటగాళ్లను నియంత్రించడం, వణ్యప్రాణుల వేట విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించాం. ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు వేటను పూర్తిగా నిషేధించేందుకు, దాని వెనుక ఉన్న కారణాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు తగిన విధంగా ఉమ్మడిగా ముందుకు వెళ్తారు. అడవుల్లో వణ్యప్రాణులు రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన వెంటనే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. వీటికి తగిన శిక్షణ ఇచ్చి పంపడమే కాకుండా, పర్యవేక్షణ చేసేందుకు కూడా అంగీకరించింది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల వల్ల పంట, ఆస్తి నష్టం తగ్గుతుందని ఆశిస్తున్నాం. కుంకీ ఏనుగులపై సత్వర నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎకో టూరిజం అభివృద్ధికి రెండు రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను చర్చించాం. అలాగే సఫారీ, జంగిల్ టూర్ వంటి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించాం. పర్యావరణ హితమైన ఎకో టూరిజం ప్రోత్సాహం మీద మాట్లాడాం. పూర్తిస్థాయిలో అడవులు, వాటి రక్షణ విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు సమష్టి సహకారంతో ముందుకు సాగుతారు. వర్క్ షాపులు, సమావేశాలు నిర్వహణతో ముందుకు వెళ్తారు. పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించాం’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


కన్నడలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటాను

‘‘కన్నడ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు అమితమైన గౌరవం. ఇక్కడి భాష గొప్పగా ఉంటుంది. కన్నడలో అనర్గళంగా మాట్లాడేలా నేర్చుకుంటాను. కన్నడ కంఠీరవ, అగ్ర కథానాయకులు రాజ్‌కుమార్ నటించిన 'గంధద గుడి' సినిమాలో అటవీ పరిరక్షణ గురించి వివరించారు. అడవులకు రక్షణగా ఉండే డీ.ఎఫ్.ఓ. పాత్రను హీరోగా ఆ చిత్రంలో చూపారు. ఇప్పుడు సినిమాల్లో ఆ తీరు మారింది. అడవులు కొట్టేవారు హీరోగా కనిపిస్తున్నారు. అడవుల రక్షణకు సామాజిక చైతన్యం కూడా చాలా అవసరం. ప్రజల్లో కూడా దీనిపై చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు మొదలు కావాలి. అటవీ ఉత్పత్తుల రక్షణ, వన్య ప్రాణులకు భద్రత, స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు అడవుల పెంపుదలకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఉమ్మడిగా పనిచేస్తాయి. ఎంఓయూ ప్రకారం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తాం. అలాగే కర్ణాటక నుంచి అధికంగా యాత్రికులు శ్రీశైలం, తిరుమలకు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో యాత్రీకుల సదన్ నిర్మాణం నిమిత్తం తగిన భూమి కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి స్థలాలు కేటాయించేలా చొరవ తీసుకుంటాను’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు


సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్

ఈ సమావేశానికి వచ్చే ముందు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. సిద్ధరామయ్య తన మంత్రివర్గ సహచరులు, అధికారులను పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేశారు. అనంతరం సిద్ధరామయ్య పవన్ కళ్యాణ్‌ని సత్కరించారు.

Updated Date - Aug 08 , 2024 | 10:53 PM