Share News

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

ABN , Publish Date - Aug 12 , 2024 | 05:07 AM

సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బుచ్‌, ఆమె భర్త ధావల్‌ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి.

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

  • సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి

  • మాధవి రాజీనామా చేయాలి: విపక్షాలు

  • సుప్రీం సుమోటోగా స్వీకరించాలి: ఖర్గే

  • సెబీ విశ్వసనీయతకు భంగం: రాహుల్‌

  • తక్షణం దర్యాప్తు జరిపించాలి: ఏచూరి

  • ఆర్థిక వ్యవస్థల హైజాక్‌: ఆర్జేడీ

  • ఇదంతా విదేశీ కుట్ర.. విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి: బీజేపీ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బుచ్‌, ఆమె భర్త ధావల్‌ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి.

స్వయంగా తన మీదే ఆరోపణలు వచ్చినందున మాధవి సెబీ చైర్‌పర్సన్‌ పదవి నుంచి వైదొలగాలని పేర్కొన్నాయి. ఈ భారీ కుంభకోణంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగనంతవరకూ ప్రధాని మోదీ.. ఏడు దశాబ్దాల కృషితో నిర్మించిన రాజ్యాంగబద్ధ సంస్థలను పక్కనపెట్టి తన స్నేహితుడిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు.

స్టాక్‌మార్కెట్‌ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన సెబీపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని, స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఆరోపణలు వచ్చిన దృష్ట్యా మాధవి బుచ్‌ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ఖర్గే ఆదివారం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ పెట్టారు.

అదానీపై సెబీ దర్యాప్తునకు సంబంధించి నెలకొన్న సందేహాన్నింటినీ తొలగించేలా కేంద్రప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. ‘2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ కంపెనీలపై దర్యాప్తు జరిపిన సెబీ.. ఎక్కడా తప్పు జరగలేదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ, తాజాగా సెబీ చీఫ్‌తోనే క్విడ్‌ ప్రో కో జరిగినట్లుగా వెల్లడైంది.


సెబీపై నమ్మకంతో తమ కష్టార్జితాన్ని స్టాక్‌మార్కెట్లో పెడుతున్న చిన్న, మధ్యస్థాయి ఇన్వెస్టర్లను కాపాడాలి. జేపీసీని ఏర్పాటు చేసి ఈ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు.

సెబీ చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో ఆ సంస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిన్నదని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. స్టాక్‌మార్కెట్లో తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన చిన్న, మధ్య స్థాయి మదుపరులు నష్టపోతే దానికి మోదీ, సెబీ చైర్‌పర్సన్‌, గౌతమ్‌ అదానీ బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. జేపీసీ దర్యాప్తునకు మోదీ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు.

సెబీ ‘ఎక్స్‌’ ఖాతాపై పలు ప్రశ్నలు

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ కూడా ఎక్స్‌లో ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. సెబీ ‘ఎక్స్‌’ ఖాతా ప్రజలకు అందుబాటులో లేదని, లాక్‌ అయి ఉందని జైరాం వెల్లడించారు.

సెబీ అత్యున్నత అధికారులపైనే నీలినీడలు కమ్ముకున్న వేళ ఇది మరిన్ని సందేహాలకు తావిస్తోందన్నారు. సెబీ దేశ ప్రజానీకం అస్తి అని, దానిని ప్రజలకు కనిపించకుండా ఎలా దాచిపెడతారని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.


మాధవి సెబీ చైర్‌పర్సన్‌ పదవి చేపట్టిన తర్వాత 2022లో గౌతమ్‌ అదానీ ఆమెను వెంటవెంటనే రెండుసార్లు కలిశారని చెప్పారు. ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్‌ పదవి నుంచి మాధవి వైదొలగాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

దీనిపై తక్షణం దర్యాప్తు జరిపించాలని, మోదీ, ఆర్థికమంత్రి నిర్మల మాట్లాడాలని పేర్కొన్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఏ స్థాయిలో హైజాక్‌ చేశారో ఈ అవినీతి వ్యవహారం వెల్లడిస్తోందని ఆర్జేడీ విమర్శించింది.

దేశంలో ఆర్థిక అస్థిరతకు కుట్ర

దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించి కల్లోల పరిస్థితులను తీసుకురావాలనే విదేశీ కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ విమర్శించింది.

అదానీ గ్రూప్‌ మీద గతేడాది తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌పై భారతీయ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, పార్లమెంటు సమావేశాల సమయంలోనే విదేశాల నుంచి ఇటువంటి నివేదికలు వెల్లడవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు.

Updated Date - Aug 12 , 2024 | 07:09 AM