Share News

Viral: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై కారులో ఎక్కించుకొని.. వీడియో తీసి..

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:12 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై ఓ నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి, కారులో ఎక్కించుకొని..

Viral: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై కారులో ఎక్కించుకొని.. వీడియో తీసి..
Madhya Pradesh News

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పరిచయమైన మైనర్ బాలికపై ఓ నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి, కారులో ఎక్కించుకొని.. ఈ దురాగతానికి తెగబడ్డాడు. అంతేకాదు.. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోని ఇంటర్నెట్‌లో పోస్టు చేశాడు. అది వైరల్‌గా మారి కుటుంబ సభ్యుల కంటపడటంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయికి కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరచూ చాటింగ్ చేసుకోవడంతో.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి తన స్నేహితుడిని ఆమెకు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ ఇద్దరు కలిసి ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలోనే ఓసారి కలుద్దామని నిర్ణయించుకున్నారు. జూన్ 1వ తేదీన ఆ ఇద్దరు నిందితులు మరో స్నేహితుడ్ని వెంట వేసుకొని.. ఆ యువతి ఉంటున్న గ్రామానికి వెళ్లారు. ఓ రహస్యమైన ప్రదేశంలో ఆమెను కలిసి.. కారులో షికారుకి వెళ్లొద్దామని బలవంతంగా ఎక్కించుకున్నారు. అప్పుడే వాళ్ల నిజస్వరూపం బయటపడింది.


Read Also: మింగిన పామును బయటకు ఎలా వదులుతోందో చూడండి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనని విడిచిపెట్టమని వేడుకున్నా.. ఆ దుర్మార్గుడు వదల్లేదు. మిగిలిన ఇద్దరులో ఒకరు డ్రైవ్ చేస్తుండగా.. మరొకరు ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను తిరిగి ఇంటి వద్ద దించేసి.. తాము చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియోని వైరల్ చేస్తామని బెదిరించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని చెప్పారు. అయితే.. ఆ అమ్మాయి నిరాకరించడంతో, నిందితులు అన్నంత పని చేశారు. ఆ వీడియోని నెట్టింట్లో వదిలారు. అది వైరలై.. యువతి కుటుంబసభ్యుల కంటపడింది. దీంతో.. వాళ్లు నిలదీయగా, అప్పుడు ఆ అమ్మాయి అసలు నిజం చెప్పేసింది.


అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని వాళ్లకు వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఇద్దరి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు కారుని స్వాధీనం చేసుకొని.. వాటిని సీజ్ చేశారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 04:12 PM