Share News

Delhi : సెబీ చైర్మన్‌ అక్రమ పెట్టుబడులపై..కాంగ్రెస్‌, బీజేపీ ఢీ

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:27 AM

విదేశాల్లోని అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్‌ మాధవి బుచ్‌ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణ.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది! ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.

Delhi : సెబీ చైర్మన్‌ అక్రమ పెట్టుబడులపై..కాంగ్రెస్‌, బీజేపీ ఢీ

  • జేపీసీతో విచారణకు మోదీకి భయమెందుకు?

  • మాధవి బుచ్‌ రాజీనామా చేయరేం?: రాహుల్‌

  • 20 వేల కోట్లకు పైగా బినామీ లావాదేవీలు: జైరాం

  • జేపీసీ వేయకుంటే ఆందోళనలు: కేసీ వేణుగోపాల్‌

  • మాధవి వైదొలగాలి: ఇండియా ఎంపీలు, నేతలు

  • ఆమెకు అండగా.. సెబీ, బీజేపీ, అదానీ గ్రూప్‌

  • సోరోస్‌ ఏజెంట్‌గా రాహుల్‌ వ్యవహరిస్తున్నారు

  • ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్‌ కుట్ర: రవిశంకర్‌

  • రాహుల్‌ సంపద 59ు పెరిగింది: మాలవీయ

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లోని అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్‌ మాధవి బుచ్‌ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణ.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది! ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.

అదానీ వ్యవహారంపై సెబీ దర్యాప్తుచేస్తుండగానే ఈ వివరాలు బయటపడ్డాయని.. దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చునని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

Untitled-1 copy.jpg

అదానీ గ్రూపులో రూ.20 వేల కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జరిగాయని, విద్యుత్‌, బొగ్గు పరికరాల్లో అధిక ధరల్లో ఇన్వాయి్‌సలు జారీ చేశారని... భారీ ఎత్తున నగదు అక్రమ చలామణీ జరిగిందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కీలక మౌలిక రంగాలను అదానీకి అప్పగించారని.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో అదానీ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ వ్యవహరాలను నిర్వహించారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

అంతేకాక.. సెబీ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతూనే ఆమె కన్సల్టెంట్‌ సంస్థలను నిర్వహించారని, అలా నిర్వహిస్తూనే అదానీ గ్రూప్‌ సంస్థలపై దర్యాప్తు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. కాగా.. ఈ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ హెచ్చరించారు.


మరోవైపు.. మాధవి బుచ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌ వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఆప్‌ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

‘‘సెబీ చైర్మన్‌ ఎందుకు రాజీనామా చేయరు? జేపీసీ విచారణకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు. ఏ నిధులపై విచారణ జరిపించాలో ఆ నిధులనే సెబీ చైర్మన్‌ పెట్టుబడులుగా పెట్టారని మహువా మొయిత్రా ఆరోపించారు.

ఇది వ్యక్తిత్వ హననమే

హిండన్‌బర్గ్‌ నివేదిక, ప్రతిపక్షాల ఆగ్రహం నేపథ్యంలో.. సెబీ చైర్మన్‌ మాధవికి సెబీ, బీజేపీ, అదానీ గ్రూప్‌ రక్షణగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మాధవి బుచ్‌, ఆమె భర్త ఖండించారు.

అదానీ గ్రూప్‌ పై వచ్చిన అన్ని ఆరోపణలపై తాము విచారణ జరిపించామని.. తన పెట్టుబడుల వివరాలను ఆమె ఎప్పుడూ దాచిపెట్టలేదని, వాటిపై విచారణ జరిగిన సందర్భాల్లో ఆమె విచారణ నుంచి తప్పుకొన్నారని సెబీ వివరణ ఇచ్చింది.


మాధవి బుచ్‌, ఆమె భర్త నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టారని.. అదానీ గ్రూప్‌ పెట్టుబడుల నిర్ణయాల్లో ఆమె హస్తం లేదని.. మొత్తం తమ పెట్టుబడుల్లో వారి పెట్టుబడులు 1.5 శాతం మాత్రమేనని అదానీ గ్రూప్‌ తెలిపింది.

దేశంలో పెట్టుబడులను నిలిపివేసేందుకు కాంగ్రెస్‌ కుట్రకు పాల్పడుతోందని మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు.

దేశంలో ఆర్థిక అరాచకత్వాన్ని వ్యాపింపజేసేందుకు రాహుల్‌ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోందన్నారు. హిండెన్‌ బర్గ్‌ సంస్థలో ప్రధాన వాటాదారుడైన జార్జ్‌ సోరోస్‌ ఏజెంట్‌గా రాహుల్‌ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇక.. రాహుల్‌గాంధీ సంపదలో 43ు సంపద భారత స్టాక్‌ మార్కెట్‌లో ఉందని, 2019లో రాహుల్‌ చరాస్తుల విలువ 59ు మేర పెరిగిందని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ అన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 06:35 AM