Share News

G. Kishan Reddy: తెలంగాణకు ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:28 AM

తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు.

G. Kishan Reddy: తెలంగాణకు ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం

  • అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బందేంటి?

  • కొత్తగా సీఎం అయ్యారు.. సంయమనంతో ఉండండి

  • కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌ ముందుకు వెళ్తున్నారు

  • పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు.. హామీలు నెరవేర్చని

  • రేవంతే రాజీనామా చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ కోసమో.. రేవంత్‌ రెడ్డి కోసమే తాము పనిచేయబోమని, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్లో ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులిచ్చామని చెప్పారు. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారని, సంయమనంతో పనిచేయాలని, అప్పుడే ఇంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు.


రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ దారిలో వెళుతున్నారన్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ పెట్టుకుంటే, రేవంత్‌ సీఎం కాగానే కొడంగల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదని, కొత్త పించన్లు లేకపోగా పాత పించన్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏం చేశారో చెప్పమంటే చేతకాదు కానీ కేంద్ర బడ్జెట్‌ పేరు చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడతారా? అంటూ మండిపడ్డారు. తాను అవసరం కోసం పార్టీ మార్చే వ్యక్తిని, అధికారం, పదవుల కోసం జెండా మార్చే ఆలోచన ఉన్నోడిని కాదని చెప్పారు. డబ్బులిచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతి అని, ఆ విషయం ప్రజలకు తెలుసన్నారు.


తాను సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం, తెలంగాణ ప్రజలకు, దేశానికి, తమ పార్టీకి బానిసని, అంతే తప్ప గాంధీ కుటుంబానికి బానిసను కాదని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినపుడు ఏ జెండా పట్టుకున్నానో తుది శ్వాసవరకు అదే జెండాతో ఉంటానని స్పష్టం చేశారు. రాజీనామా చేయాల్సింది తాను కాదని.. హామీలు అమలు చేయని రేవంత్‌ రెడ్డే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎకరానికి 18వేల చొప్పున 60 లక్షల మంది తెలంగాణ రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. 20లక్షల మంది రైతులనుంచి ధాన్యం సేకరణకు రూ.25వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. లక్షా 32వేలతో చేపట్టిన జాతీయ రహదారులు తెలంగాణకు లబ్ధి చేయడం లేదా? అని ప్రశ్నించారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10,990 కోట్లతో 1600 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. రామగుండంలో 6300 కోట్లతో ఫర్టిలైజర్‌ కంపెనీ ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ దాచేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కిషన్‌ రెడ్డి చెప్పారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సింగరేణి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒడిసాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని ఆయన చెప్పారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అసెంబ్లీలో చేసిన తీర్మానంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆ తీర్మానం పొలిటికల్‌ బ్లాక్‌ పేపర్‌ అని విమర్శించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి దాదాపు రూ.10 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందనే స్పృహ కూడా లేకుండా నిందించడం విచారకరమంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో తెలంగాణ ఓ భాగమనే విషయాన్ని మరిచి ముఖ్యమంత్రి, మంత్రులు, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం నేతలు మాట్లాడాటం అవకాశవాదానికి పరాకాష్ఠ అని సంజయ్‌ అన్నారు.


కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలోని ఏ పంచాయతీలోనైనా అభివృద్ధి జరిగిందని నిరూపించే దమ్ముందా ? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. అధికారం చేపట్టిన వెంటనే బీఆర్‌ఎస్‌ పాలనపై శ్వేత పత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై కలిసి పోరాడతామంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామాలు చూస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అర్థమవుతోందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనానికి ఇది సంకేతమా? అని ప్రశ్నించారు.

Updated Date - Jul 25 , 2024 | 04:28 AM